జనతా వారధి ఫిర్యాదుకు తక్షణ స్పందన
మాచర్లలో దోమల నివారణకు ఫాగింగ్ ప్రారంభం
మాచర్ల పట్టణంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ఫలితాన్నిచ్చింది. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తక్షణమే స్పందించి దోమల నివారణ చర్యలను ప్రారంభించారు.
ప్రతి గురువారం బీజేపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించే జనతా వారధి కార్యక్రమంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణ రెండో వార్డుకు చెందిన శేషగిరి పానయ్య పట్టణంలో దోమల తీవ్రత పెరిగిందని, ఫాగింగ్ నిర్వహించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా అందజేశారు. వెంటనే స్పందించిన కమిషనర్ శనివారం స్వయంగా పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బందితో ఫాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రోజుకు కొన్ని వార్డుల చొప్పున మొత్తం మాచర్ల పట్టణం అంతటా ఫాగింగ్ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రజా సమస్యపై వెంటనే స్పందించిన కమిషనర్ వేణుబాబుకు బీజేపీ నాయకులు మరియు శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.



