మనిషికి కష్టాలు కన్నీళ్లు బాధలు ఎందుకు?
మనకే కాదు, ఎందరికో వచ్చే అనుమానం … ఎలా ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు!!…
ఏమిటి స్వామీ నాకీ కష్టాలు, ఇవి ఎప్పటికి తీరేను, అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు.
శిష్యుడివంక దయగా చూస్తూ చెప్పాడాయన.
నేనో చిన్నకథ చెప్తాను వింటావా, అన్నారు
తలూపాడు శిష్యుడు, ఆయన కథ చెప్పసాగాడు.
ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోకచిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించ సాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుకగా మారిన అందులోని గొంగళిపురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనిం చాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రం లోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు.
అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు.
ఆ సీతాకోక చిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగిందతనికి. దాంతో చిన్న కత్తెరని తీసుకుని ఆ గూడుగోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. ఆ రంధ్రంలోంచి ఆ సీతాకోకచిలుక బయటికి వచ్చింది.
అయితే దాని శరీరం ఉబ్బి ఉంది. రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేలమీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది.
తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను. ఆజీవి ఆ గూడులోనే మరికొంతకాలం ఉండి ఉంటే, దాని శరీరంలోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి, అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది.
అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకుని స్వేచ్ఛగా ఎగిరిపోయేది. కాని అతడిలోని దయతో కూడిన తొందరపాటుతనం వల్ల ఇది అతను గ్రహించలేదు.
అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్నమవుతాయి.
మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మనమీద దయతలచి మధ్యలో తీసేయడు.
లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం.
దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది.
అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడుని పాడుచేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా, మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు.
*సమస్త లోకాః సుఖినో భవంతు –



